తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా భూమన కరుణాకర రెడ్డి వ్యవహరిస్తున్నారు. తక్షణం కోట్లాదిమంది హిందువులకు ఆయన క్షమాపణ చెప్పాలి’ అని ఏపీ సాధు పరిషత్‌ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి, గౌరవాధ్యక్షుడు అట్లూరి నారాయణరావు డిమాండ్‌ చేశారు. ఇందులో భాగంగా ఆదివారం భూమన ఇంటి ముట్టడికి శిల్పారామం నుంచి బయల్దేరారు.విషయం తెలుసుకున్న పోలీసులు శిల్పారామం వద్ద గేట్లు మూసేసి వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. వైసీపీ కార్యకర్తలు శ్రీవారి ఆలయం, తిరుమల గురించి తప్పుగా మాట్లాడితే వారించకుండా మరింత దిగజారి హిందూమతాన్ని కించపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీ మాజీ చైర్మన్‌ పేరుతో వైసీసీ సోషల్‌ మీడియా, రాజకీయ వేదికలపై టీటీడీని అప్రతిష్టపాలు చేస్తున్నారని. తక్షణం శ్రీవారికి, హిందూ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని, మాజీ చైర్మన్‌ ట్యాగ్‌లైన్‌ను రాజకీయ వేదికలపై వాడరాదని డిమాండ్‌ చేశారు. లేదంటే రాష్ట్రమంతా ముఖ్య పట్టణాల్లో ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.‘కత్తులు సాన పట్టించుకుని వైసీపీ నేతలు బహిరంగంగా రప్పారప్పా అంటే పట్టించుకోని మీరు. శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే మమ్మల్ని అడ్డుకుంటారా’ అని పోలీసులను ప్రశ్నించారు. రాజకీయాలతో తమకు సంబంధం లేదని తిరుమల క్షేత్ర పరిరక్షణ తమకు ముఖ్యమని శ్రీనివాసానంద సరస్వతి, అట్లూరి నారాయణరావు తెలిపారు. ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.

భూమనను క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తే సాధుసంతులను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. తిరుమలను వ్యాపార కేంద్రంగా భూమన మార్చడం నిజం కాదా అని నిలదీశారు. ఈ అంశాలపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్‌ విసిరారు. అనంతరం కరుణాకర రెడ్డికి సద్బుద్ధి కలగాలని కోరుతూ సాధుసంతులు తమ కమండలంలోని నీళ్లతో మంత్రోచ్ఛారణ చేసి కిందకు వదిలారు. తిరుక్షేత్రాల రక్షణ సమితి అధ్యక్షుడు ఓంకార్‌, సాధువులు శివానందస్వామి, దయానందస్వామి తదితరులు పాల్గొన్నారు.


Leave a comment